సింగపూర్, జూన్ 12 : మాటల యుద్ధంతో ఉప్పు-నిప్పులా ఉండే అమెరికా అధ్యక్షుడు ట్రంప్- ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఈ మంగళవారం సింగపూర్లో సమావేశమయ్యారు. సింగపూర్లోని కేపెల్లా హోటల్లో ఇరు దేశాధినేతలు కలుసుకుని కరచాలనం చేసుకున్నారు. అంతలోనే వాతావరణం చల్లబడి, ఇద్దరూ చర్చలకు కూర్చుంటారని ఎవరూ ఊహించలేదు. అందుకే ప్రపంచమంతా సింగపూర్ భేటీవైపు ఆసక్తిగా చూస్తోంది.
మొదట ఇరువురు నేతలు కొంత అప్రమత్తతతో ముభావంగా ఉన్నట్టు కనిపించినా.. ఆ తర్వాత కాస్తా హుషారుగా పరస్పరం స్నేహపూర్వకంగా కలిసిపోయారు. అయితే, అణ్వాయుధాలు ప్రధాన అంశంగా జరిగిన వీరి భేటీలో ఎలాంటి ఫలితం వచ్చిందనేది ఇంకా అస్పష్టంగానే ఉంది. కిమ్తో భేటీ అనంతరం ట్రంప్ మాట్లాడుతూ.. ఇరుదేశాల మధ్య అద్భుతమైన బంధం ఏర్పడబోతున్నదని పేర్కొన్నారు. తాము ఇరువురు పెద్ద సమస్యను, పెద్ద సందిగ్ధాన్ని పరిష్కరించినట్టు చెప్పారు. కలిసి పనిచేస్తూ.. కలిసి సమస్యలు పరిష్కరించకుంటామని ఆయన తెలిపారు.