బెంగుళూరు, జూన్ 13 : కర్ణాటకలో జయనగర్ అసెంబ్లీ స్థానంను కాంగ్రెస్ దక్కించుకొంది. కాంగ్రెస్ అభ్యర్ధి సౌమ్య రెడ్డి.. సమీప బీజేపీ ప్రత్యర్ధి ప్రహ్లాద పై 3,775 ఓట్ల తేడాతో విజయం సాధించారు. జయనగర బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే విజయ్కుమార్ అకస్మిక మరణంతో ఇక్కడ మే 12న జరగాల్సిన ఎన్నికలు వాయిదాపడిన విషయం తెలిసిందే. దీంతో ఎన్నికల కమిషన్ ఈ స్థానానికి జూన్ 11న( సోమవారం) ఎన్నికలు నిర్వహించగా 55శాతం పోలింగ్ నమోదైంది.
ఈ ఎన్నికలో బీజేపీ తరపున విజయ్ సోదరుడు ప్రహ్లాద, కాంగ్రెస్ తరపున మాజీ మంత్రి రామలింగారెడ్డి కుమార్తె సౌమ్య రెడ్డి పోటీ పడ్డారు. కాంగ్రెస్–జేడీఎస్ కూటమి అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో సౌమ్యాకు జేడీఎస్ మద్దతు ప్రకటించింది. దీంతో కాంగ్రెస్ సులవుగా విజయం సాధించింది. జయనగర్ ఫలితాలు అనుకూలంగా రావడంతో కాంగ్రెస్ కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు.