తిరుమల, జూన్ 13 : తితిదే (తిరుమల తిరుపతి దేవస్థానం)తో పాటు రాష్ట్ర ప్రభుత్వంపైనా ఇటీవల కాలంలో విజయసాయిరెడ్డి, రమణ దీక్షితులు తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో తితిదే పరువుకు భంగం కలిగించారంటూ ఇద్దరిపై, తిరుమల శ్రీవారి ఆలయ మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణ దీక్షితులుకు తితిదే నోటీసులు జారీ చేసింది. శ్రీవారి ఆభరణాలు సీఎం చంద్రబాబు ఇంట్లో ఉన్నాయంటూ విజయసాయిరెడ్డి తీవ్రస్థాయిలో ఆరోపించారు. రమణ దీక్షితులు సైతం చెన్నై, హైదరాబాద్, దిల్లీ ప్రాంతాల్లో మీడియా సమవేశాలు ఏర్పాటు చేసి విమర్శలు గుప్పించారు.
వీటిపై తితిదే ధర్మకర్తల మండలి తీవ్రంగా స్పందించింది. దేవస్థానం పరువుకు భంగం కలిగిస్తున్న వ్యక్తులపై న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని తీర్మానించింది. ఈ నేపథ్యంలో తితిదే నోటీసులు జారీ చేసింది. దేవస్థానం పరువుకు భంగం కలిగించిన మీపై ఎందుకు చర్యలు తీసుకోరాదో వివరణ ఇవ్వాలని వారిద్దరిని తితిదే నోటీసుల్లో సంజాయిషీ ఇవ్వాలని తెలిపింది.