బెంగళూరు, జూన్ 13 : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేసిన ఛాలెంజ్ పై కర్ణాటక సీఎం, జేడీఎస్ నేత హెచ్డీ కుమారస్వామి స్పందించారు. 'హమ్ ఫిట్ తో ఇండియా ఫిట్' లో భాగంగా తనకు ప్రధాని మోదీ ఫిట్నెస్ సవాల్ విసరడాన్ని గౌరవంగా భావిస్తున్నట్లు కర్ణాటక సీఎం కార్యాలయం ట్విటర్ ద్వారా తెలిపారు. తన ఆరోగ్యంపై మోదీ శ్రద్ధ తీసుకున్నందుకు ధన్యవాదాలు తెలిపారు.
ఫిజికల్ ఫిట్నెస్ అనేది ఎవరికైనా ముఖ్యమే. అందుకే ప్రతిఒక్కరూ ఎక్సర్సైజ్, యోగా, జిమ్ లాంటి ఏదో రకంగా ఫిట్నెస్ను కాపాడుకుంటారని పేర్కొన్నారు. తాను రోజూ ట్రెడ్మిల్పై వర్కవుట్స్, యోగా చేస్తానని కుమారస్వామి వెల్లడించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అభివృద్ధి గురించి అంతకుమించి ఆందోళన చెందుతున్నానని, అందుకు మీ మద్దతు కావాలంటూ ప్రధాని మోదీని కర్ణాటక సీఎంఓ ట్విటర్ ద్వారా కుమారస్వామి వెల్లడించారు.
కాగా, టీమిండియా క్రికెట్ సారథి విరాట్ కోహ్లి విసిరిన సవాల్ ను స్వీకరించిన మోదీ కొన్నివ్యాయామాలు చేస్తూ ఒక వీడియోను పోస్ట్ చేశారు. అందులో కర్ణాటక సీఎం కుమారస్వామికి, 2018 కామన్వెల్త్ గేమ్స్లో పతకాలు సాధించిన మానికా బాత్రాతో పాటు 40 ఏళ్లకు పైగా వయసున్న ఐపీఎస్ అధికారులను ‘హమ్ ఫిట్ తో ఇండియా ఫిట్’ ఛాలెంజ్కు మోదీ ట్విటర్ ద్వారా బుధవారం ఉదయం ఆహ్వానించిన సంగతి తెలిసిందే.