విజయనగరం, జూన్ 13 : విజయనగరం జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం చోటు చేసుకుంది. జిల్లాలోని భోగాపురం మండలంలోని పోలిపల్లి వద్ద కోల్కతా చెన్నై జాతీయ రహదారిపై బుధవారం రెండు లారీలు, బస్సు ఢీ కొట్టుకున్నాయి. విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం సమీపంలోని కోడూరు గ్రామానికి చెందిన సుమారు అరవై మంది భక్తులు కాశీ వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కోడూరుకు మరో రెండు గంటల్లో చేరుకుంటారనగా ఈ దుర్ఘటన జరిగింది.
ఈ ప్రమాదంలో బస్సు నుజ్జునుజ్జయింది. మృతులంతా నర్సీపట్నానికి చెందినవారిగా తెలుస్తోంది. బస్సులో మరికొందరు ప్రయాణీకులు చిక్కుకున్నారు. తీవ్ర గాయాలపాలైన వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. ప్రమాద తీవ్రత దృష్ట్యా పలువురి యాత్రికుల ఆరోగ్య పరిస్థితి విషయంగా ఉంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.
ఈ ప్రమాదంపై ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఆరా తీశారు. వ్యక్తిగత పర్యటనలో భాగంగా జర్మనీలో ఉన్న ఆయన ప్రమాద ఘటనపై విజయనగరం జిల్లా ఎస్పీని ఫోనులో అడిగి వివరాలు తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలందించాలని.. సహాయ కార్యక్రమాల కోసం అదనపు పోలీసు బలగాలను ఘటన స్ధలానికి తరలించాలని ఎస్పీని ఆదేశించారు.