అఫ్గాన్‌తో టెస్టు: ఇండియా 474 ఆలౌట్..

     Written by : smtv Desk | Fri, Jun 15, 2018, 12:31 PM

అఫ్గాన్‌తో టెస్టు: ఇండియా 474 ఆలౌట్..

బెంగళూరు, జూన్ 15 : అఫ్గానిస్తాన్‌తో చిన్నస్వామి స్టేడియం వేదికగా జరుగుతున్న టెస్టు మ్యాచ్‌లో టీమిండియా జట్టు తన తొలి ఇన్నింగ్స్‌లో 474 పరుగులకు ఆలౌటైంది. 347/6 ఓవర్‌ నైట్‌ స్కోరుతో శుక్రవారం రెండో రోజు ఆటను కొనసాగించిన భారత్‌ మరో 127 పరుగులు జోడించి మిగతా నాలుగు వికెట్లను కోల్పోయింది. ఈ రోజు ఆటలో ఓవర్‌నైట్‌ ఆటగాడు అశ్విన్‌(7) ఆదిలోనే పెవిలియన్‌కు చేరగా, మరో ఓవర్‌నైట్‌ ఆటగాడు హార్దిక్‌ పాండ్యాతో కలిసి రవీంద్ర జడేజా ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లాడు. ఈ క్రమంలో పాండ్య అర్ధశతకం పూర్తిచేసుకొని శతకం దిశగా అడుగులు వేశాడు. కానీ 99.2 ఓవర్‌లో వఫాదర్‌ బౌలింగ్‌లో జజైయ్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరగడంతో హర్ధిక్‌ పోరాటానికి తెరపడింది.

అనంతరం అఫ్గాన్‌ బౌలర్లు జోరు కొనసాగించడంతో భారత్‌ 104.5ఓవర్లలో 474పరుగులు చేసి ఆలౌటైంది. చివర్లో ఉమేశ్‌ యాదవ్‌(26నాటౌట్‌; 21బంతుల్లో 2×4, 2×6) కాసేపు మెరిపించాడు. అంతకుముందు తొలి రోజు ఆటలో శిఖర్‌ ధావన్‌(107), మురళీ విజయ్‌(105), కేఎల్‌ రాహుల్‌(54)లు ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. అఫ్గానిస్తాన్‌ బౌలర్లలో యమీన్‌ అహ్మద్‌జాయ్‌ మూడు వికెట్లతో రాణించగా, వఫాదార్‌, రషీద్‌ ఖాన్‌ చెరో రెండు వికెట్లు సాధించారు. మహ్మద్‌ నబీ, రషీద్‌ ఖాన్‌, ముజీబ్‌ ఉర్‌ రెహ్మాన్‌లు తలో వికెట్‌ తీశారు.





Untitled Document
Advertisements