బెంగళూరు, జూన్ 15 : భారత్తో జరుగుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో ఆఫ్గానిస్థాన్ 109 పరుగులకే ఆలౌటైంది. భారత్ బౌలర్లు ధాటికి ప్రత్యర్ధి జట్టు బ్యాటింగ్ లైనప్ కకావికలమయ్యింది. తొలి ఇన్నింగ్స్లో టీమిండియా 474 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే. అనంతరం బ్యాటింగ్కు దిగిన ఆఫ్గాన్ ఇన్నింగ్స్ తొలినుంచీ తడబడుతూనే సాగింది. భారత్ బౌలర్లు ఆదినుంచి ఆధిపత్యం సాగించడంతో పసికూన బెంబేలెత్తింది.
ముఖ్యంగా రవిచంద్రన్ అశ్విన్(4/27) తన స్పిన్ మాయాజాలంతో ఆఫ్గాన్ ఇన్నింగ్స్ ను దెబ్బకొట్టాడు. అతనికి తోడుగా ఇషాంత్ శర్మ(2/28), రవీంద్ర జడేజా(2/18) రాణించారు. ఆఫ్గాన్ ఇన్నింగ్స్ లో మహమ్మద్ నబి చేసిన 24 పరుగులే అధిక స్కోర్ కావడం గమనార్హం. మహమ్మద్ షాహ్జాద్(14), రహమత్ షా(14), షాహిది(11), అస్గర్(11), ముజీబ్ రహమాన్(15) మాత్రమే రెండంకెల స్కోరు సాధించారు. దీంతో ఆఫ్గాన్ తొలి ఇన్నింగ్స్ లో 365 పరుగులు వెనుకబడి ఫాలోఆన్ గండంలో పడింది.