బెంగళూరు, జూన్ 15 : అఫ్ఘనిస్తాన్ తో చారిత్రాత్మక టెస్ట్ మ్యాచ్ లో భారత్ విజయం సాధించింది. ఎన్నో అంచనాలతో తొలి మ్యాచ్లోనే అదరగొట్టాలనుకున్న అఫ్గానిస్థాన్ కలలు ఒక్క రోజులోనే ముగిసిపోయాయి. భారత బౌలర్ల ధాటికి టెస్టు అనుభవం లేని అఫ్గాన్ బ్యాట్స్మెన్ వెంటవెంటనే పెవిలియన్కు క్యూ కట్టి తొలి ఓటమి మూటగట్టుకున్నారు. టాస్ నెగ్గిన టీమిండియా తొలి రోజు ఓపెనర్లు శిఖర్ ధావన్ (107), మురళీ విజయ్(105) సెంచరీలు చేయడంతో 474 భారీ స్కోర్ సాధించింది. అనంతరం తొలి ఇన్నింగ్స్లో 109 పరుగులకే ఆలౌట్ అయిన ఆఫ్ఘాన్ జట్టు... ఫాలోఆన్లోనూ 38.4ఓవర్లలో 103పరుగులకే చాప చుట్టేసింది.
ఈ క్రమంలో తొలి ఇన్నింగ్స్లో రవిచంద్రన్ అశ్విన్(4/27) అఫ్గాన్ పని పట్టగా, ఫాలోఆన్లో రవీంద్ర జడేజా(4/17), ఉమేశ్ యాదవ్(3/26)తో కలిసి అఫ్గాన్ భరతం పట్టాడు. దీంతో 262 తేడాతో భారత్ భారీ గెలుపును సొంతం చేసుకుంది. టీమిండియాకు టెస్ట్ మ్యాచ్ల్లో అతి పెద్ద ఇన్నింగ్స్ విజయం ఇదే కావడం విశేషం. 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' శతక వీరుడు శిఖర్ ధావన్ కు దక్కింది.