ఢిల్లీ, జూన్ 16 : శుక్రవారం నెలవంక కనిపించడంతో శనివారం దేశమంతటా ఈద్ ఉల్ ఫితర్ (రంజాన్) పర్వదినాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు. శుక్రవారం సాయంత్రం 7.35 గంటలకు నెలవంక కనిపించిందని జమా మసీదు షాహీ ఇమామ్ బుఖారీ ప్రకటించారు. దేశ ప్రజలకు రంజాన్ సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు ఆయన తెలిపారు. ఈద్-ఉల్-ఫితర్ను పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. 'ఈద్ ముబారక్, ఈ పండుగ రోజున మన సమాజంలోని ఐక్యత, సామరస్యం మరింత పెంపొందాలని ఆశిస్తున్నా' అని మోదీ ట్వీట్ చేశారు.
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా ప్రజలకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. 'ఈద్ ముబారక్, భగవంతుడు మనందరికి శాంతి, సంతోషం, జ్ఞానం, మంచి ఆరోగ్యం కలిగేలా ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను' అని ట్విటర్లో పోస్ట్ చేశారు. నిన్న రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి కూడా ప్రజలకు రంజాన్ శుభాకాంక్షలు తెలియచేశారు. పలువురు జాతీయ రాజకీయల నాయకులు, పలువురు ప్రముఖులు కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.