గువాహటి, జూన్ 16 : మానవత్వం మరిచిపోయే, మృగంలా కన్నకూతురిపై అత్యాచారానికి పాల్పడిన ఓ ప్రబుద్ధుడు.. తన పై కేసు పెట్టిందని భార్యను హత్య చేశాడు. కోర్టు ప్రాంగణంలో అందరూ చూస్తుండగానే భార్యను గొంతు కోసి చంపేశాడు. ఈ దారుణమైన ఘటన అసోంలోని దిబ్రుగఢ్లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దిబ్రూగఢ్కు చెందిన పూర్ణ నహర్ దేకా అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటూ ప్రస్తుతం బెయిల్పై ఉన్నాడు. తన భర్త కుమార్తెపై అత్యాచారానికి పాల్పడ్డాడంటూ అతడి భార్య రీటా 9 నెలల క్రితం కేసు పెట్టింది. దీంతో పూర్ణను పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత బెయిల్పై బయటకు వచ్చాడు.
ఇదిలా ఉండగా.. ఈ కేసుకు సంబంధించిన విచారణ నిమిత్తం పూర్ణ, అతడి భార్య శుక్రవారం దిబ్రుగఢ్ సెషన్స్ కోర్టుకు హాజరయ్యారు. ఆ సందర్భంలో కోర్టు గది వెలుపల కూర్చున్న భార్య రీటాపై పూర్ణ దాడి చేశాడు. తనతో పాటు తెచ్చుకున్న కత్తితో గొంతు కోశాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన రీటాను వెంటనే ఆసుపత్రికి తరలించారు. కానీ ఆమె అప్పటికే మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అరెస్టు చేసి కేసు నమోదు చేశారు.