రాష్ట్రాల అభివృద్ధితోనే దేశాభివృద్ధి..

     Written by : smtv Desk | Sun, Jun 17, 2018, 05:09 PM

రాష్ట్రాల అభివృద్ధితోనే దేశాభివృద్ధి..

హైదరాబాద్, జూన్ 17 : రైతు'బంధు'గా మారాలంటూ ముఖ్యమంత్రి కేసీఆర్.. కేంద్రప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రప్రభుత్వ పథకాలను దేశవ్యాప్తంగా అమలుచేయాలని., రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడం సహా వ్యవసాయ రంగానికి ఉపాధి హామీని అమలు చేయాలని కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో నీతి ఆయోగ్‌ పాలకమండలి నాలుగో సమావేశం జరుగుతోంది. ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన జరుగుతోన్న ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్‌ గవర్నర్లు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి పథకాల గురించి వివరించారు.

పాలమూరు-రంగారెడ్డి, కాళేశ్వరం ప్రాజెక్టులు పూర్తయితే అదనంగా 26 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. అలాగే రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో 18 లక్షల ఎకరాల స్థిరీకరణ జరుగుతోందని.. కీలక ప్రాజెక్టులను తొందరగా పూర్తి చేసేందుకు ఆధునిక పద్ధతులను ఉపయోగిస్తున్నామన్నారు. వ్యవసాయ రంగంలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యతను ఇస్తున్నామని.. రూ. 1,050 కోట్ల వ్యయంతో గత మూడేళ్లలో 18.30 మెట్రిక్ టన్నుల సామర్థ్యం ఉన్న 356 గోడౌన్లను నిర్మించామని వివరించారు. అంతేకాకుండా అభివృద్ధి చెందిన రాష్ట్రాలకు ఎక్కువ నిధులను ఇవ్వలేని పరిస్థితుల్లో... పన్ను రాయితీలనైనా కల్పించాలని కోరారు.

రాష్ట్రాల అభివృద్ధి పైనే దేశాభివృద్ధి ఆధారపడి ఉందన్న కేసీఆర్.. వ్యవసాయానికి అనుబంధ రంగాలైన పౌల్ట్రీ, మేకలు, గొర్రెలు, చేపల పెంపకం, డెయిరీ రంగాలపై దృష్టి సారించి.. వాటికి ఆదాయపు పన్ను నుంచి మినహాయింపు ఇవ్వాలన్నారు. అలాగే జాతీయ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ రంగంతో అనుసంధానించి.. వైద్యం, విద్య, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, నగరీకరణ అంశాల్లో రాష్ట్రాలకు మరింత స్వేచ్ఛను ఇవ్వాల౦టూ కేంద్రాన్ని కోరారు. విదేశీ వ్యవహారాలు, ఆర్థిక, రక్షణ, అంతర్జాతీయ అంశాలపై కేంద్ర ప్రభుత్వం మరింత దృష్టి సారించాలని సూచించారు.





Untitled Document
Advertisements