హైదరాబాద్, జూన్ 18 : సుమంత్ అశ్విన్, నిహారిక కొణిదెల జంటగా తెరకెక్కిన చిత్రం 'హ్యాపి వెడ్డింగ్'. యువీ క్రియేషన్స్ బ్యానర్లో తొలిసారిగా సుమంత్ అశ్విన్ నటిస్తున్నారు. చక్కటి ఫ్యామిలీ ఎమోషన్స్, సున్నితమైన సన్నివేశాలు, చిలిపిగా సాగే కథనంతో దర్శకుడు లక్ష్మణ్ తెరకెక్కించిన ఈ చిత్ర వెడ్డింగ్ ఇన్విటేషన్ని జూన్ 21న విడుదల చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ మీడియాతో మాట్లాడారు.
యూవీ క్రియేషన్స్ లాంటి ప్రతిష్ఠాత్మక నిర్మాణ సంస్థతో కలిసి పాకెట్ సినిమా బ్యానర్లో తెలుగు చిత్రంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. సుమంత్ అశ్విన్, నిహారిక తమ పాత్రల్లో చాలా చక్కగా ఒదిగిపోయారు. సన్నివేశానికి డైలాగ్స్ ఎంత ఊపిరినిచ్చాయో.. తమన్ నేపథ్య సంగీతం దాన్ని మించి ఉందని చెప్పడంలో అతిశయోక్తికాదు. పెళ్ళి కుదిరిన రోజు నుండి పెళ్ళి జరిగేరోజు వరకు రెండు కుటుంబాల మధ్య, రెండు మనసుల మధ్య ఏం జరుగుతుందనే విషయాన్ని చాలా అందంగా మా దర్శకుడు తెరకెక్కించాడు. ప్రతి ప్రేక్షకుడు తమని తాము చూసుకునేలా రూపొందిన చిత్రమిది. అన్ని వర్గాల, అన్ని వయసుల వారు ఈ చిత్రానికి కనెక్ట్ అవుతుందని చెప్పుకొచ్చారు.
ఇప్పటివరకు సుమంత్ చేసిన సినిమాలు దాదాపు ఊహించని విధంగా ఫెయిల్యూర్ అయ్యాయి. ఇప్పుడు ఈ సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకోవాలని భావిస్తున్నాడు. మరోవైపు నిహారికకు సైతం ఈ సినిమా విజయం చాలా ముఖ్యం. ఇదివరకు నాగశౌర్యతో కలిసి నటించిన "ఒక మనసు" చిత్రం అనుకున్నంతగా ప్రేక్షకులకు కనెక్ట్ కాలేకపోయింది. దీంతో ఈ ఇద్దరికీ ఈ చిత్ర విజయం చాలా కీలకంగా మారింది