హైదరాబాద్, జూన్ 18 : సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల 'భరత్ అను నేను' సినిమాతో బంపర్ హిట్ కొట్టారు. ఆయన తన తదుపరి ప్రాజెక్ట్ లో చాలా బీజీగా గడుపుతున్నారు. ప్రస్తుతం మహేష్ 25వ సినిమా షూటింగ్ కోసం ఆదివారం డెహ్రాడూన్ వెళ్లారు. ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తుండగా..పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుంది. సోమవారం నుంచి సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. ఇందులో పాల్గొనేందుకు మహేశ్ ఆదివారం అక్కడికి చేరుకున్నారు.
అయితే ఈ సినిమా సెట్కు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ వెళ్లినట్లు తెలుస్తోంది. ఆయన మహేశ్ను కలిసి, కాసేపు మాట్లాడినట్లు సోషల్మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే దీనికి సంబంధించి చిత్ర బృందం నుంచి సమాచారం రావాల్సి ఉంది. ఈ సినిమాలో నటుడు అల్లరి నరేష్ ప్రధాన పాత్రలో కనిపించనున్నారట. ఆదివారం నరేష్ తన ఫేస్బుక్ ఖాతాలో డెహ్రాడూన్ విమానాశ్రయం ఫొటోను షేర్ చేశారు. దీన్ని బట్టి ఆయన కూడా ఈ షెడ్యూల్లో పాల్గొంటున్నట్లు తెలుస్తోంది.