చెన్నై, జూన్ 18 : కోలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్, హాలీవుడ్ వరకూ వెళ్లి నటుడిగా తన సత్తా చాటుకుంటున్న నటుడు ధనుష్. ప్రస్తుతం ఆయన చేతిలో చాలా చిత్రాలు ఉన్నా, 'వేలై ఇల్లా పట్టాదారి–2' చిత్రం తరువాత ఆయన నటించిన చిత్రం విడుదల కాలేదు. దీంతో ఆయన అభిమానులు తదుపరి చిత్రం కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. అయితే ఇంత వరకూ తన మామ, సూపర్స్టార్ రజనీకాంత్ హీరోగా నిర్మించిన కాలా చిత్ర నిర్మాణం, విడుదల కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. కాలా విడుదల కావడంతో ధనుష్ తాజాగా వరుసగా తన చిత్రాలను విడుదల చేయడానికి ప్రణాళికను సిద్ధం చేసుకుంటున్నారు. ఆయన నటించిన వడచెన్నై, మారి–2 చిత్రాలు నిర్మాణంలో ఉన్నాయి. ఈయన తన వండర్బార్ ఫిలింస్ పతాకంపై కథానాయకుడిగా నటించి నిర్మించిన మారి చిత్రం కమర్షియల్గా మంచి సక్సెస్ను అందుకుంది.
బాలాజీ మోహన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి సీక్వెల్గా తెరకెక్కుతున్న చిత్రం మారి–2. నటుడు ధనుష్నే నిర్మించి నటిస్తున్న ఇందులో నటి సాయిపల్లవి కథానాయకిగా నటిస్తోంది. నటి వరలక్ష్మీశరత్కుమార్ కీలక పాత్రను పోషిస్తున్న ఇందులో తాజాగా మరో కథానాయకిగా నటి విద్య వచ్చి చేరింది. 'ఇరవుక్కు ఆయిరం కన్గళ్', 'పంసంగ–2' చిత్రాల్లో నటించిన ఈ అమ్మడికి ధనుష్తో మారి–2 చిత్రంలో నటించే లక్కీచాన్స్ తలుపుతట్టింది. ఈ విషయాన్ని విద్య తన ట్విట్టర్లో పేర్కొంది. నటి సాయిపల్లవి ఈ చిత్రంలో ఆటోడ్రైవర్గా నటిస్తున్నారు. ఇక వరలక్ష్మీశరత్కుమార్ కలెక్టర్గా నటిస్తోంది. మలయాళ నటుడు టోవినో థామస్ విలన్గా, నటుడు కృష్ణ ముఖ్య పాత్రలోనూ నటిస్తున్నారు. ఈ చిత్రం తెన్కాశి పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటోంది.