బెంగళూరు, జూన్ 18 : గౌరీ లంకేశ్ హత్యపై కర్ణాటకకు చెందిన శ్రీరామ్ సేన సంఘ నేత ప్రమోద్ ముత్తాలిక్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రముఖ పాత్రికేయురాలు గౌరీ లంకేశ్ హత్య కేసుపై ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటివరకూ స్పందించకపోవడంతో విపక్షాలు మండిపడుతున్నాయి. హత్య జరిగి ఇన్ని రోజులు గడిచిన మోదీ ఎందుకు మౌనం వహిస్తున్నారని ప్రశ్నిస్తున్నాయి. తాజాగా ఈ ఘటనపై కర్ణాటకకు చెందిన శ్రీరామ్ సేన సంఘ నేత ప్రమోద్ ముత్తాలిక్ మాట్లాడుతూ.. 'కర్ణాటకలో ఏ కుక్క చనిపోయినా దానికి ప్రధాని మోదీ ఎందుకు స్పందించాలి? ఆయన అన్నింటికీ స్పందిస్తారా?' అని ప్రశ్నించారు. దాంతో ఆయన వ్యాఖ్యలు కాస్తా చర్చనీయాంశంగా మారాయి.
ప్రమోద్ ఇలా వార్తల్లోకెక్కడం ఇది తొలిసారి కాదు. 2009లో మంగళూరులోని ఓ పబ్లో యువతీ, యువకులపై దాడి చేసి వార్తల్లో నిలిచారు. అయితే గౌరీ లంకేశ్ను హత్య చేసింది తానేనని ప్రధాన నిందితుడు పరశురామ్ వాగ్మోరే అంగీకరించినట్లు వార్తలు వెలువడుతున్నాయి. అతడు పోలీసుల ఎదుట నేరాన్ని ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. 2017 సెప్టెంబరు 5న బెంగళూరులోని రాజరాజేశ్వరి నగర్లో గౌరీ లంకేశ్ను ఆమె ఇంటి వద్దే దుండగులు కాల్చి చంపిన సంగతి తెలిసిందే.