ముంబై, జూన్ 18 : రోడ్డుపై చెత్త పారేశాడని ప్రశ్నించినందుకు బాలీవుడ్ నటి అనుష్క శర్మపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. ఆ వీడియోను షేర్ చేసిన విరాట్ కోహ్లీపై కూడా నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. కాగా..'విరుష్క'కు కేంద్రమంత్రి కిరణ్ రిజీజు మద్దతుగా నిలిచారు. అనుష్క, విరాట్ చేసిన పనిని సమర్థిస్తూ ట్వీట్ చేశారు.
"విరాట్, అనుష్కకి పబ్లిసిటీ కావాలా? వారిద్దరూ ‘మాకు ప్రైవసీ కావాలి’ అని వేడుకుంటూ ఉంటారు. మనం చేసే పనే మన వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంది. డబ్బు, చదువుతో సామాజిక విలువలు రావు. సమాజం పట్ల మన ఆలోచనా విధానాన్ని బట్టి వస్తాయి. భారతదేశాన్ని శుభ్రంగా ఉంచండి" అని పేర్కొన్నారు.
ఇటీవల అనుష్క-విరాట్ కారులో వెళుతుండగా పక్కనే మరో కారులో వెళ్తున్న ఓ వ్యక్తి ప్లాస్టిక్ చెత్తను రోడ్డుపై విసిరేశాడు. అది చూసిన అనుష్క అతన్ని తిట్టి... డస్ట్బిన్ వాడాలని సూచించింది. ఈ తతంగాన్ని కారులోనే ఉన్న విరాట్ వీడియో తీసి సోషల్మీడియాలో పోస్ట్ చేశారు. దాంతో పబ్లిసిటీ కోసమే ఈ వీడియో తీశారంటూ నెటిజన్లు వారిపై విమర్శలు చేస్తున్నారు.