వరంగల్, జూన్ 19 : ప్రఖ్యాత మిమిక్రీ కళాకారుడు డాక్టర్ నేరెళ్ల వేణుమాధవ్ కొద్దిసేపటి క్రితం కన్నుమూశారు. కొద్దిరోజుల నుండి శ్వాసకోశ వ్యాధితో బాధపడుతున్న ఆయన కాసేపటి క్రితం ఆయన స్వగృహంలో కన్నుమూశారు. నేరెళ్ల మృతితో తెలంగాణ తల్లి మరో ముద్దుబిడ్డను కోల్పోయిందని పలువురు ఆయనకు సంతాపం తెలుపుతున్నారు. విషయం తెలుసుకున్న ఆయన అభిమానులు, ప్రముఖులు ఆయన ఇంటికి చేరుకొని నివాళులు అర్పిస్తున్నారు.
నేరెళ్ళ తన పదహారేళ్ళ ప్రాయంలోనే మిమిక్రీని ఎంచుకొని ఇప్పటికి ఎన్నో వేల సంఖ్యలో ప్రదర్శనలిచ్చారు. అంతేకాకు ఆంధ్రా, కాకతీయ వర్శిటీలు ఆయనకు గౌరవ డాక్టరేట్ పురస్కారాలను అందించాయి. కేంద్ర ప్రభుత్వం ఆయనకు 2001 లో పద్మశ్రీ అవార్డు ఇచ్చి సత్కరించింది. 1932, డిసెంబర్ 28 వరంగల్ జిల్లా మట్టెవాడలో శ్రీహరి, శ్రీలక్ష్మి దంపతులకు జన్మించిన ఆయన.. ఇప్పటికి దేశవిదేశాల్లో ప్రదర్శనలు ఇచ్చారు. నేటికి ఆయన జన్మదినాన్ని ప్రపంచ మిమిక్రీ కళాకారుల దినోత్సవంగా జరుపుకుంటున్న సంగతి తెలిసిందే.