రాస్తోవ్, జూన్ 19 : రష్యా వేదికగా జరుగుతున్న ఫిఫా ప్రపంచకప్ అట్టహాసంగా సాగుతుంది. ఈ మ్యాచ్ లు చూడడానికి దేశవిదేశాల నుండి ప్రజలు పయనమవుతున్నారు. కాగా సౌదీ అరేబియా ఫుట్బాల్ జట్టు తృటిలో పెను ప్రమాదం నుంచి బయటపడింది. రష్యాలో జరుగుతున్న ఫిఫా వరల్డ్ కప్లో భాగంగా సౌదీ ఫుట్బాల్ ప్లేయర్లు విమానంలో ప్రయాణిస్తున్న సమయంలో ఇంజిన్లో ఆకస్మికంగా మంటలు ఎగిసిపడ్డాయి. ఉరుగ్వేతో మ్యాచ్ ఆడేందుకు రాస్తోవ్కు వెళ్తున్న సమయంలో విమానంలోని ఓ ఇంజిన్ నుంచి మంటలు వ్యాపించాయి. ఈ ఘటనపై స్పందించిన సౌదీ కెప్టెన్ ఓసామా ..‘మేము ప్రయాణించే విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. థాంక్ గాడ్. అందరం క్షేమంగా ఉన్నాం. హోటల్కు చేరుకున్నాం' అని సామాజిక మాధ్యమాల ద్వారా అభిమానులకు తెలిపాడు.
విమానం గాల్లో ఉండగానే మంటలు వ్యాపించడంతో ఆటగాళ్లంతా ఆందోళనకు లోనయ్యారు. అయితే ఆ విమానం చివరకు సురక్షితంగా దిగడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. తమ ఆటగాళ్ళు అంతా సురక్షితంగా ఉన్నట్లు సౌదీ ఫుట్బాల్ సంఘం ప్రకటించింది. సాంకేతిక లోపం కారణంగా ఇంజిన్లో మంటలు వ్యాపించినట్లు తెలుస్తుండగా, మంటలు చెలరేగడానికి పక్షి ఢీకొనడం కారణంగా రష్యా ఎయిర్లైన్స్ వర్గాలు తెలిపాయి. ఈ ఘటనను విమానంలో ఉన్న ఆటగాళ్లు వీడియో తీయగా, దాన్ని సౌదీ మీడియా సోషల్ మీడియాలో షేర్ చేసింది.