దుబాయ్, జూన్ 20 : టీమిండియా క్రికెటర్ శిఖర్ ధావన్ ఐసీసీ ర్యాంకింగ్స్ లో తన స్థానాన్ని మెరుగుపరుచుకున్నాడు. భారత్-అఫ్గానిస్థాన్, శ్రీలంక-వెస్టిండీస్ మధ్య టెస్టు మ్యాచ్ సిరీస్ ముగియడంతో ఐసీసీ ర్యాంకింగ్స్ను విడుదల చేసింది. దీంట్లో ధావన్ టెస్టుల్లో కెరీర్ బెస్ట్ ర్యాంకును అందుకున్నాడు. అఫ్గానిస్థాన్తో బెంగళూరు వేదికగా జరిగిన టెస్టులో ఓపెనర్ శిఖర్ ధావన్ మ్యాచ్ తొలి రోజు లంచ్ విరామానికి ముందే శతకాన్ని నమోదు చేసిన విషయం తెలిసిందే. ఐసీసీ ప్రకటించిన తాజా ర్యాంకింగ్స్లో శిఖర్ ధావన్ ఏకంగా 10 స్థానాలు ఎగబాకి 24వ స్థానంలో నిలిచాడు.
టెస్టు ర్యాంకింగ్స్లో శిఖర్ ధావన్కు ఇదే కెరీర్ బెస్ట్ ర్యాంకు కాగా.. మరో భారత ఆటగాడు మురళీ విజయ్ కూడా ఆరు స్థానాలు ఎగబాకి 23వ స్థానంలో నిలిచాడు. ఆసీస్ ఆటగాడు స్మిత్ యథావిధిగా తొలి స్థానంలో కొనసాగుతున్నాడు. విరాట్ కోహ్లీ, రూట్ ఆ తర్వాతి స్థానాల్లో నిలిచారు. నయా వాల్ పుజారా 6వ స్థానంలోనే ఉన్నాడు. బౌలింగ్ విభాగంలో రవీంద్ర జడేజా ఒక స్థానాన్ని మెరుగుపరుచుకుని మూడో స్థానంలో నిలిచాడు. అశ్విన్ (5వ స్థానం)లో కొనసాగుతున్నాడు.