ముంబై, జూన్ 20 : దేశవ్యాప్తంగా "మిస్ ఇండియా పోటీ" కి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అలాంటి ప్రతిష్టాత్మకమైన 'ఫెమీనా మిస్ ఇండియా 2018' పోటీల్లో 30 మంది ఫైనలిస్ట్లు పాల్గొనగా.. అందులో తమిళనాడుకు చెందిన అనుకృతి వాస్ మిస్ ఇండియా కిరీటం దక్కించుకున్నారు. నిన్న రాత్రి ముంబై డోమ్లోని 'ఎన్ఎస్సీఐ ఎస్వీపీ' స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమానికి బాలీవుడ్ ప్రముఖులు కరణ్ జోహార్, ఆయుష్మాన్ ఖురానా హోస్ట్లుగా వ్యవహరించారు.
గతేడాది 'మిస్ వరల్డ్' గా ఎన్నికైన మానుషి చిల్లర్, అనుకృతికి కిరీటాన్ని అలంకరించింది. ఈ ప్రతిష్టాత్మక పోటీకి క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్, కేఎల్ రాహుల్, ప్రఖ్యాత ఫ్యాషన్ డిజైనర్ గౌరవ్ గుప్తా, బాలీవుడ్ హీరోయిన్ మలైకా అరోరా, నటులు బాబీ డియోల్, కునాల్ కపూర్ వంటి ప్రముఖులు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు.
హర్యానాకు చెందిన మీనాక్షి చౌదరి మొదటి రన్నరప్గా, ఆంధ్రప్రదేశ్కు చెందిన శ్రియా రావు రెండో రన్నరప్గా నిలిచారు. మానుషితో పాటు 2017లో మిస్ యునైటెడ్ కాంటినెంట్ విజేత సనా దువా, మిస్ ఇంటర్కాంటినెంటల్ ప్రియాంక కుమారీలు ముగ్గురు విజేతలను కిరీటాలతో అలంకరించారు. ప్రస్తుతం అనుకృతి చెన్నైలోని లయోలా కాలేజ్లో ఫ్రెంచ్లో బీఏ చేస్తున్నారు.