ముంబై, జూన్ 20 : వచ్చే ఏడాది మహారాష్ట్రలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్సభ ఎన్నికల్లోను శివసేన ఒంటరిగానే పోటీ చేస్తుందని.. ఎవరితోనూ పొత్తు పెట్టుకోదని శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే స్పష్టం చేశారు. అంతే కాకుండా మహారాష్ట్రకు శివసేనకు చెందిన అభ్యర్థే ముఖ్యమంత్రి అవుతారని ఆయన అన్నారు. మంగళవారం పార్టీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఓ సభలో ఉద్ధవ్ ఠాక్రే మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. అబద్ధాల కోరు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా సేన కార్యకర్తలు పోరాటం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
" రాష్ట్రానికి తదుపరి సీఎం సేన తరఫు అభ్యర్థే అవుతారు. శివసేన అంటే ఏమిటో దేశమంతా త్వరలోనే చూస్తుంది. నాతో ఛాలెంజ్ చేసిన వారికి ఇది నేను చేసి చూపిస్తాను. భాజపాకు వ్యతిరేకంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేసేందుకు సహకరించాల్సిందిగా పలు ప్రాంతీయ పార్టీలు నన్ను కోరాయి. నా తండ్రితో కలిసి పనిచేసిన వారిని (బీజేపీ) ఎలా ఓడించాలో నాకు తెలుసు. వాళ్లని ఓడించడం ఎలాగో నేను అందరికీ చూపిస్తాను" అని ఠాక్రే పేర్కొన్నారు.