నిజామాబాద్, జూన్ 20 : మరో ఐదు నిమిషాల్లో కోరుకున్న జీవితంలోకి అడుగుపెడుతున్నామన్న యువ జంట ఆశలును యువతి బంధువులు ఆవిరిచేశారు. పెద్దలను ఎదిరించి ఆర్య సమాజ్లో వివాహం చేసుకోబోతున్న జంటను అమ్మాయి తరఫు బంధువులు విడదీశారు. సినీ ఫక్కీలో జరిగిన ఈ ఘటన నిజామాబాద్లో గల ఇందూరు గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. మేజర్లయిన ప్రాణదీప్, సౌజన్య అక్కడి ఆర్యసమాజ్లో ప్రేమ పెళ్లి చేసుకునేందుకు నిర్ణయించుకున్నారు.
ఇంకో ఐదు నిమిషాల్లో వివాహం ముగుస్తుందనగా.. అక్కడికి వచ్చిన అమ్మాయి తరఫు వారు పెళ్లిని నిలిపివేయాలంటూ ఆర్య సమాజ్ సభ్యులను కోరారు. ఏదైనా సమస్య ఉంటే బయట తేల్చుకోవాలని వారు చెప్పడంతో అమ్మాయిని లాక్కెళ్లబోయారు. ఇంతలో వరుడు అడ్డుపడటంతో అతనిపై దాడి చేశారు. అనంతరం తమతో రావడానికి నిరాకరిస్తున్న అమ్మాయి చెంపలు వాయించారు. ఆపై భుజాన వేసుకుని ద్విచక్రవాహనంపై ఇంటికి తీసుకెళ్లారు. దీనిపై ప్రాణదీప్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తాము మేజర్లమని, ఇద్దరం ఇష్టపడి పెళ్లి చేసుకుంటుండగా దాడి చేశారని చెప్పాడు. ఈ తతంగాన్ని అంతా ఎవరో స్మార్ట్ ఫోన్ లో వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో అదికాస్తా వైరల్ గా మారింది.