హైదరాబాద్, జూన్ 22 : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకు ఎదురుదెబ్బ తగిలింది. గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న దానం తాజాగా కాంగ్రెస్కు రాంరాం చెప్పారు. మాజీ మంత్రి దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామాకు గల కారణాలను వివరిస్తూ ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి ఆయన లేఖ రాశారు. ఈ లేఖ ప్రతిని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్కు కూడా పంపినట్టు వెల్లడించారు. రేపు మీడియా సమావేశం నిర్వహించి తన రాజీనామాకు దారితీసిన పరిస్థితులను వెల్లడిస్తానని ఆయన మీడియాకు తెలిపారు.
ఇటీవలే సంస్థాగత పదవుల భర్తీలో సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ పదవిని కోల్పోయినప్పటి నుంచీ దానం అసంతృప్తితో రగిలిపోతున్నట్లు, అందుకే రాజీనామా చేసినట్లు ఆయన వర్గీయులు పేర్కొన్నారు. రాజీనామా వార్తలు ప్రసారమైన కొద్దిసేపటికే టీపీసీసీ చీఫ్ ఉత్తమ్.. దానం ఇంటికి వెళ్లి, సముదాయించే ప్రయత్నం చేశారు. దానం కాంగ్రెస్కు రాజీనామా చేశారన్న వార్త ప్రస్తుతం రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. శుక్రవారం(రేపు) దానం తన భవిష్యత్ కార్యాచరణను మీడియాకు వివరిస్తానని ఆయన కార్యాలయం తెలిపింది.
ఇంతకు ముందు కూడా కాంగ్రెస్ను వీడి కారు ఎక్కేందుకు తీవ్రంగా యంత్నించిన ఆయన... చివరి నిమిషంలో మనుసుమార్చుకున్నారు. కొంతకాలంగా స్తంబ్ధుగా వ్యవహరిస్తోన్న దానం.. తన సిటీ ప్రెసిడెంట్ పదవిని మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్కు కట్టబెట్టడంతో ఇంకాస్త రగిలిపోయారని తెలిసింది. అదేసమయంలో అధికార పార్టీ నుంచి భారీ ఆఫర్ రావడంతో ఆయన గులాబీ గూటిలో చేరేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఆ భారీ ఆఫర్ ‘సికింద్రాబాద్ ఎంపీ టికెట్’ అన్న ప్రాచారం కూడా జోరుగా సాగుతోంది. తాజాగా ఆయన పార్టీని వీడుతున్నట్లు ప్రకటించడంతో ఆయన తదుపరి కార్యాచరణ ఏమిటనే చర్చ జరుగుతోంది.