చెన్నై, జూన్ 22 : ప్రముఖ తమిళ కథానాయకుడు కార్తి.. పాండిరాజ్ దర్శకత్వంలో "కడైకుట్టి సింగం" చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో కార్తి ఒక వ్యవసాయదారుడిగా కనిపించనున్న విషయం తెలిసిందే. తమిళంతో పాటు తెలుగులోను ఈ సినిమాను విడుదల చేయనున్నారు. అయితే తెలుగులో ఈ సినిమాకి "చినబాబు" అనే టైటిల్ ను ఖరారు చేశారు.
తెలుగులో ఈ సినిమా ఆడియో వేడుకను ఈ నెల 23వ తేదీ సాయంత్రం జరపనున్నారు. వైజాగ్ లోని 'సీఆర్ రెడ్డి కాన్వోకేషన్ హాల్' లో ఈ వేడుకను ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తోన్న సూర్య ఈ వేడుకకి ముఖ్య అతిథిగా హాజరు కానుండడం విశేషం. కార్తి సరసన సాయేషా సైగల్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకొని జులై 13న ప్రేక్షకుల ముందుకు రానుంది.