రాంచీ, జూన్ 22 : ఝార్ఖండ్లో ఘోరం చోటుచేసుకుంది. మానవ అక్రమ రవాణా గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి ముందుకు వచ్చిన ఐదుగురు మహిళలపై కొందరు మానవమృగాలు దారుణంగా అత్యాచారం చేశారు. ఈ ఘటన ఝార్ఖండ్లోని కుంతి జిల్లాలో మంగళవారం జరిగింది. మానవ అక్రమ రవాణా గురించి పాఠశాల విద్యార్థులకు అవగాహన కల్పించడానికి ఓ ఎన్జీవో తరఫున 11 మంది సభ్యుల బృందం ఝార్ఖండ్కు వెళ్లింది. అక్కడ కుంతి జిల్లాలోని కొచాంగ్ బ్లాక్లో ఆర్సీ మిషన్ పాఠశాల వద్ద ప్రదర్శన ఇస్తుండగా మోటార్ సైకిల్పై వచ్చిన సాయుధులైన దుండగులు ఎన్జీతో తరఫున వచ్చిన మగవాళ్లను కొట్టి ఐదుగురు మహిళలను ఎత్తుకుపోయారు. వారిని బలవంతంగా కార్లలో ఎక్కించి అక్కడి నుంచి తీసుకెళ్లారు.
నిర్మానుష్య ప్రాంతంలో వారిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను పోలీసులు గురువారం వెల్లడించారు. మహిళలను మూడు గంటల తర్వాత దుండగులు విడిచిపెట్టారని, వైద్య పరీక్షల్లో వారిపై అత్యాచారం జరిగినట్ల నిర్ధారణ అయ్యిందని పోలీసులు తెలిపారు. అత్యాచార ఘటనకు సంబంధించి వీడియోలు తీశామని, విషయం బయటకు చెప్తే వాటిని అంతర్జాలంలో విడుదల చేస్తామని దుండగులు బెదిరించారని బాధిత మహిళలు వెల్లడించారని పోలీసులు చెప్పారు. పోలీసులు మూడు బృందాలుగా విడిపోయి దుండగుల కోసం గాలిస్తున్నారు. కొందరిని అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.