దుబాయ్, జూన్ 23 : టోర్నీ ఏదైనా... ప్రత్యర్థి ఎవరైనా ఆధిపత్యం మాత్రం తమదేనని టీమిండియా కబడ్డీ జట్టు మరోసారి నిరూపించింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్తో జరిగిన కబడ్డీ మాస్టర్స్ టోర్నీ మొదటి మ్యాచ్లో భారత్ బోణీ చేసింది. బలమైన జట్టుతో బరిలోకి దిగిన భారత్ 36-20 తేడాతో పాకిస్థాన్పై ఘన విజయం సాధించింది. ఆరు జట్లు పాల్గొంటున్న ఈ టోర్నీలో పాక్, కెన్యాలతో కలిసి భారత్ గ్రూప్-ఎలో ఉంది. గ్రూప్-బిలో ఇరాన్, కొరియా, అర్జెంటీనా ఉన్నాయి.
అజయ్ ఠాకూర్ నాయకత్వంలో భారత ఆటగాళ్లు రెచ్చిపోయి ఆడారు. ఆద్యంతం ఆధిపత్యం చలాయించిన భారత్... ఫస్ట్ హాఫ్ ముగిసే సరికి 22–9తో స్పష్టమైన ఆధిక్యంలో నిలిచింది. ఆ తర్వాత కూడా అదే జోరు కొనసాగించి సునాయాస విజయం సొంతం చేసుకుంది. కెప్టెన్ అజయ్ ఠాకూర్ 15 రైడ్ పాయింట్లతో చెలరేగి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. భారత్ తమ తదుపరి మ్యాచ్లో శనివారం కెన్యాతో తలపడనుంది.