అందుకే కాంగ్రెస్ పార్టీకు రాజీనామా చేశాను : దానం

     Written by : smtv Desk | Sat, Jun 23, 2018, 01:23 PM

అందుకే కాంగ్రెస్ పార్టీకు రాజీనామా చేశాను : దానం

హైదరాబాద్, జూన్ 23 : గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న దానం తాజాగా కాంగ్రెస్‌కు రాంరాం చెప్పిన విషయం విదితమే. కాంగ్రెస్ పార్టీకు రాజీనామా చేసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆత్మగౌరవం లేని చోట పని చేయడం కంటే బయటకు వచ్చేయడం మంచిదని భావించే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినట్లు దానం తెలిపారు. త్వరలోనే టీఆర్ఎస్‌లో చేరుతున్నానని చెప్పిన ఆయన.. గత మూడు దశాబ్దాలుగా వివిధ స్థాయిల్లో కాంగ్రెస్ పార్టీకి సేవలు అందించిన తాను పార్టీ వీడటం వెనుకున్న కారణాలను మీడియాకు వివరించారు. డీఎస్, కేశవ రావు లాంటి బీసీ నేతలు కాంగ్రెస్ పార్టీని వదిలి వెళ్లడానికి ఒక వర్గానికి మాత్రమే ప్రాధాన్యం ఇవ్వడమే కారణమని దానం ఆరోపించారు.

"రాష్ట్రంలోని 3.70 కోట్ల మంది జనాభాలో 1.67 కోట్ల మంది బీసీలే ఉన్నారు. నిర్ణయాత్మక శక్తిగా ఉన్న బీసీలను పార్టీ పట్టించుకోవడం లేదు. ఈ విషయాలన్నీ రాహుల్ గాంధీకి చెప్పాను. వీహెచ్, పొన్నాల లక్ష్మయ్య లాంటి నాయకులు ఉండలేక ఉంటున్నారు. గాంధీ భవన్ మీటింగ్‌ల్లో, బస్సు యాత్రల్లో మాట్లాడేది అంతా ఒకే వర్గానికి చెందిన వారే. పక్కా సమాచారంతోనే ఈ మాటలు మాట్లాడుతున్నా. పీసీసీ చీఫ్‌ ఉత్తమ్ కుమార్ రెడ్డిని మిగతా నేతలు పీతల్లా పని చేయనీయడం లేదు. పీసీసీ చీఫ్‌కే ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. సీఎం అభ్యర్థిని ప్రకటించగానే.. మిగతా పదకొండు మంది నేతలు పార్టీ వీడతారు. రాజశేఖర రెడ్డిలా పార్టీకి నేనున్నా అనే నేతలు ఒక్కరైనా ఉన్నారా?" అని దానం ప్రశ్నించారు.

"రాజశేఖర రెడ్డి తర్వాత బీసీల సమస్యలపై దృష్టిని కేంద్రీకరించింది కేసీఆర్ మాత్రమే. నేనేప్పుడు వ్యక్తిగతంగా కేసీఆర్‌ను దూషించ లేదు. రాజ్యసభ సభ్యుల ఎంపిక కావొచ్చు, పథకాలు కావొచ్చు.. రాజశేఖర రెడ్డి తరహాలోనే కేసీఆర్ బీసీల కోసం పని చేస్తున్నారు. సామాజిక వర్గాల వారీగా ప్రయోజనం చేకూర్చేందుకు పథకాలు ప్రవేశపెట్టారు" అని దానం తెలిపారు. కేసీఆర్ నాకెలాంటి హామీ ఇవ్వలేలేదు. కాంగ్రెస్‌ పార్టీలో పదవి నాకు సిద్ధంగా ఉంది. కానీ బీసీల సంక్షేమం కోసం తాను పార్టీ మారుతున్నట్టు ఆయన వెల్లడించారు.





Untitled Document
Advertisements