హైదరాబాద్, జూన్ 23 : తెలుగు చిత్ర పరిశ్రమలో 1990లలో నాలుగు స్తంభాలు అనగానే.. చిరంజీవి.. బాలకృష్ణ.. నాగార్జున.. వెంకటేష్.. ఈ నాలుగు పేర్లు గుర్తుకు రావడంలో ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ఒక తరంలో ప్రేక్షకులను అలరించి ఇప్పటి తరానికి కూడా పోటీగా నిలుస్తున్నారు. టాలీవుడ్ పరిశ్రమకు నాలుగు పిల్లర్స్ నిలిచిన వీరూ.. ఇప్పుడు సీనియర్ స్టార్లు అయిపోయారు. ఇప్పుడు మన జూనియర్ హీరోలు తమ సత్తా చాటుతున్నారు.
మరి రాబోయే తరానికి స్టార్లుగా చాలా మంది కన్పిస్తున్నారు. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది పవన్ కళ్యాణ్. కానీ ఆయన సినిమాల నుంచి తప్పుకుంటున్నట్లు చెప్పేశాడు కనుక పవన్ ను పక్కన పెట్టేసి చూస్తే.. క్రేజ్ పరంగా మిగిలిన వారి కంటే ముందున్న హీరో మహేష్ బాబు. మహేష్ కు ఓ స్థానం ఇచ్చేసి మిగిలిన హీరోలను కౌంట్ చేయడంలో తప్పేమీ లేదు. తర్వాత జూనియర్ ఎన్టీఆర్ టాప్ స్టార్స్ జాబితాలో లేకపోతే.. ఈ లిస్ట్ కు అసలు అర్ధమే ఉండదు. ఆ తర్వాత రామ్ చరణ్ కు ప్లేస్ దక్కుతుంది. మగధీర తర్వాత అంతటి హిట్ లేదనే కొరత మొన్నటివరకూ వెంటాడింది కానీ.. ఇప్పుడు 'రంగస్థలం' తో మెగాపవర్ స్టార్ తన సత్తా చూపాడు.
ఇప్పుడు నాలుగు స్తంభాలు లెక్క చరిత్రే అనుకోవాలి. ఎందుకంటే.. టాప్ రేంజ్ హీరోలుగా ఇప్పటికే ప్రూవ్ చేసుకున్న హీరోలు మరో ఇద్దరు ఉన్నారు. 'బాహుబలి'తో దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్న ప్రభాస్ తో పాటు.. స్టైలిష్ స్టార్ అంటూ జనాలతో పిలిపించుకుంటూ నిలకడగా రేంజ్ పెంచుకున్న 'అల్లు అర్జున్' కూడా.. ఇప్పటికే టాప్ హీరోల కేటగిరిలో చేరిపోయారు. రాబోవు పదేళ్లు ప్రధాన పోటీ ఈ స్టార్ హీరోల మధ్య ఉండనుందని సినీవిశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.