హైదరాబాద్, జూన్ 23 : యువ కథానాయకుడు విజయ్ దేవరకొండ ఇటీవల 'అర్జున్ రెడ్డి' సినిమాకు గానూ ఉత్తమ నటుడిగా తొలి ఫిలింఫేర్ అవార్డు అందుకున్న సంగతి తెలిసిందే. అనంతరం ఈ అవార్డును ముఖ్యమంత్రి సహాయనిధికి ఇచ్చేస్తున్నట్లు విజయ్ ప్రకటించారు. అంతేకాదు ఈ అవార్డును వేలం వేసి తద్వారా వచ్చే డబ్బును ఆపదలో ఉన్నవారికి ఇవ్వాల్సిందిగా తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ను కోరారు. అయితే విజయ్ తీసుకున్న నిర్ణయానికి టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ ప్రముఖులు కూడా ఫిదా అయ్యారు.
పలువురు బాలీవుడ్ ప్రముఖులు జూహీ చావ్లా, రిచా చద్దా, శిఖ తలసానియా తదితరులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై జూహీ స్పందిస్తూ..'విజయ్ తీసుకున్న నిర్ణయం అంతకంటే గొప్పది. నటీనటుల జీవితంలో అవార్డులకు ప్రత్యేక స్థానం ఉంటుంది. విజయ్ నిర్ణయంపై ఎంతో స్ఫూర్తిపొందుతారు' అని తెలిపారు. కాగా తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ సైతం అవార్డును ముఖ్యమంత్రి సహాయనిధికి అందించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.