ముంబై, జూన్ 24 : టీమిండియా క్రికెట్ సారథి విరాట్ కోహ్లి, అతడి భార్య అనుష్క శర్మ కలిసి కార్లో ప్రయాణిస్తుండగా.. అర్హన్ సింగ్ ఒక వ్యక్తి రోడ్డుపై చెత్త పారబోస్తుండగా అనుష్క అతడిని మందలించడం ఇటీవల చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన వీడియోను కోహ్లి ట్విటర్లో షేర్ చేయగా.. తర్వాత అర్హన్ వాళ్లకు బదులిస్తూ ఒక వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నాడు. తనతో అనుష్క చాలా అమర్యాదకరంగా మాట్లాడిందని, ఆమెను ఆపకుండా ఆ ఉదంతాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పంచుకోవాలన్న స్వార్ధమే కోహ్లిలో కనిపించిందని విమర్శించాడు.
అతను అంతటితో ఆగకుండా ఇప్పుడు కోహ్లి, అనుష్కలకు అతను లీగల్ నోటీసు కూడా ఇచ్చాడు. "నా న్యాయ సలహాదారులు వారికి నోటీసులిచ్చారు. బంతి ఇప్పుడు వారి కోర్టులో ఉంది. దీనిపై ఏ వ్యాఖ్యానాలూ చేయను. వారి బదులు కోసం ఎదురు చూస్తున్నా" అని అర్హన్ చెప్పాడు. ఈ నోటీసులపై విరాట్ దంపతులు స్పందించాల్సి ఉంది.