వలిగొండ, జూన్ 24 : యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం వేములకొండ శివారు లక్ష్మాపురంలో ఆదివారం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. వ్యవసాయ కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి మూసీ కాలువలో బోల్తా పడటంతో 15 మంది దుర్మరణం పాలయ్యారు. మరికొందరు క్షతగాత్రులయ్యారు. ప్రమాద సమయంలో ట్రాక్టర్లో సుమారు 30 మంది వరకు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వానాకాలం ప్రారంభం కావడంతో వేముల కొండ చెరువు పక్కన పొలంలో పత్తి విత్తనాలు నాటేందుకు వ్యవసాయ కూలీలు ట్రాక్టర్లో బయలుదేరారు.
చెరువు కట్టపై ప్రయాణిస్తున్న సమయంలో ట్రాక్టర్ ఒక్కసారిగా అదుపుతప్పి మూసీ కాలువలోకి బోల్తా పడింది. దీంతో 10 మందికి పైగా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న పోలీసులు స్థానికుల సాయంతో సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదానికి డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని మృతుల బంధువులు భావిస్తున్నారు. పత్తి విత్తనాలు నాటడానికి వెళ్తున్న సమయంలో ఈ ఘోరం జరిగిందని గ్రామస్తులు చెబుతున్నారు. ఈ ప్రమాదంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో భారీగా ప్రాణనష్టం సంభవించడం పట్ల విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాడ సానుభూతి ప్రకటించారు.