హైదరాబాద్, జూన్ 23 : యువ కథానాయకుడు సుధీర్ బాబు 'సమ్మోహనం' చిత్ర౦ విజయాన్ని ఆస్వాదిస్తున్నారు. ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి శివలెంక కృష్ణప్రసాద్ నిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్రంపై, నటీనటులపై సినీ ప్రముఖులు, అభిమానులు ప్రశంసల జల్లులు కురిపిస్తున్నారు. ఈ సినిమాతో మంచి విజయం అందుకున్న సుధీర్ తన తర్వాత సినిమాలకు సంబంధించి ఓ వినూత్న నిర్ణయం తీసుకున్నారు.
ఇంతకు విషయం ఏంటంటే.. ఇక నుండి తను తీయబోయే సినిమాలకు డబ్బింగ్ చెప్పేటప్పుడు ఓ తెలుగు పండితుడి సాయం తీసుకోవాలను భావిస్తున్నాడట. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సుధీర్.. "భవిష్యత్తులో నేను చేసే సినిమాలకు డబ్బింగ్ చెప్పేటప్పుడు తెలుగు పండితుడి సాయం తీసుకుంటాను. డబ్బింగ్ చెప్పేటప్పుడు నా భాషలో ఎలాంటి తప్పులు దొర్లకుండా చూసుకోవాలి. అన్ని సంభాషణలు సరిగ్గా వచ్చాయి అనుకున్నప్పుడే సినిమా విడుదల చేస్తాను" అని పేర్కొన్నారు. దర్శకుడు ఇంద్రగంటి మోహన్కృష్ణను స్ఫూర్తిగా తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.