న్యూఢిల్లీ, జూన్ 24 : రషీద్ ఖాన్.. ఈ అఫ్ఘాన్ క్రికెటర్ ఈ సీజన్ ఐపీఎల్ లో అందరి దృష్టిని ఆకర్షించాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ తరుపున బరిలోకి దిగిన ఈ యువ స్పిన్నర్ అటు బాల్ తోను.. ఇటు బంతితో అద్భుతంగా రాణించి భారత్ లోను అభిమానులను సంపాదించుకొన్నాడు. కాగా ఈ యువ సంచలనంపై భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసల వర్షం కురిపించారు. ప్రపంచ క్రికెట్కు రషీద్ ఒక అరుదైన సంపదగా మోదీ అభివర్ణించారు.
మన్కీ బాత్ రేడియో కార్యక్రమంలో భాగంగా అఫ్గానిస్తాన్తో సంబంధాల గురించి మోదీ మాట్లాడుతూ.. ఇటీవల ఆ దేశ క్రికెట్ జట్టు భారత్తో తొలి టెస్టు మ్యాచ్ ఆడిన విషయాన్ని ప్రస్తావించారు. ఇది ఇరు దేశాలు గర్వించే అంశంగా ఈ మ్యాచ్ ను పేర్కొన్నారు. ఈ క్రమంలోనే రషీద్ ఖాన్ను పొగడ్తలతో ముంచెత్తారు. ప్రపంచ క్రికెట్కు రషీద్ ఒక విలువైన ఆస్తి అని.. ఇండియన్ ప్రీమియర్ లీగ్-11 సీజన్లో రషీద్ రాణించడాన్ని ఈ సందర్భంగా ప్రధాని గుర్తుచేసుకున్నారు.