హైదరాబాద్, జూన్ 23 : నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ నెటిజన్లు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ ఉంటారు తెలంగాణ ఐటీ శాఖల మంత్రి కేటీఆర్. రాష్ట్రంలోని సమస్యల గురించి పలువురు చేసిన ట్వీట్లపై స్పందిస్తుంటారు. అలాగే తాజాగా టాలీవుడ్ హీరోయిన్ ఈషా రెబ్బ చేసిన ఓ ట్వీట్కు కేటీఆర్ వెంటనే సమాధానం చెప్పారు. ఇంతకు ఈషా ఏమని ట్వీట్ చేసిందంటే.. "భారతదేశంలో ఏయే రాష్ట్రాలు ప్లాస్టిక్ను బ్యాన్ చేశాయి? పలు రంగాల్లో అగ్రగామిగా నిలుస్తున్న మన తెలంగాణ రాష్ట్రం పేరు ఈ జాబితాలో లేకపోవడం నిరాశ కలిగించింది. ప్లాస్టిక్ నిషేధంపై దృష్టి సారించి భావితరాలకు మంచి భవిష్యత్తును అందించేందుకు కృషి చేయాలి" అంటూ కేటీఆర్ కు ఈషా ట్వీట్ చేసింది.
అయితే ఈషా ట్వీట్ పై వెంటనే స్పందించిన కేటీఆర్.. "ప్లాస్టిక్ నిషేధం అనేది ఇప్పట్లో జరిగే పనికాదు. చట్టప్రకారం నిర్ణయం తీసుకున్నంత మాత్రన ప్లాస్టిక్ నిషేధం పక్కాగా అమలు కావాలంటే.. సమస్య తీవ్రత గురించి ప్రజలలో అవగాహన కలగాలి" అంటూ రిప్లయ్ ఇచ్చారు. తన ట్వీట్కు ఇంత త్వరగా స్పందించినందుకు ఈషా ఆనందం వ్యక్తం చేస్తూ కేటీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు. 'మీలాంటి ప్రతిభావంతులైన యువ నాయకులు ఉన్నంతవరకు ఈ ప్లాస్టిక్ సమస్య అసాధ్యం అని అనుకోవడం లేదు. ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా మన రాష్ట్రాన్ని నిలపాలని కోరుకుంటున్నా" అంటూ వెల్లడించింది.