బ్రెడా (నెదర్లాండ్స్), జూన్ 25 : ప్రతిష్ఠాత్మక చాంపియన్స్ ట్రోఫీలో భారత హాకీ జట్టు ఆదరగొడుతుంది. ఆదివారం జరిగిన మ్యాచ్లో భారత్ 2-1తో ఒలింపిక్ ఛాంపియన్ అర్జెంటీనాను ఓడించింది. ఆరంభ మ్యాచ్లో దాయాది పాకిస్థాన్ను చిత్తుచేసి గొప్ప ఆరంభం దక్కించుకున్న మన జట్టు.. ఇప్పుడు ఏకంగా ఒలింపిక్ చాంపియన్ అర్జెంటీనాను ఓడించి ఔరా అనిపించింది. దీంతో టోర్నీలో వరుసగా రెండో విజయాన్ని భారత్ సాధించింది. టీమిండియా తరఫున హర్మన్ప్రీత్ సింగ్ (17వ), మన్దీప్ సింగ్ (28వ) చెరో గోల్ కొట్టారు. ప్రపంచ నంబర్-2 అర్జెంటీనా తరఫున నమోదైన ఏకైక గోల్ను గాంజాలో పీలట్ సాధించాడు. ఆరు జట్లు పాల్గొంటున్న ఈ టోర్నీలో రెండు విజయాలు నమోదు చేసిన భారత్ ప్రస్తుతం ఆరు పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. బుధవారం తదుపరి మ్యాచ్లో ఆస్ట్రేలియాతో టీమిండియా తలపడనుంది.