వాషింగ్టన్, జూన్ 25 : మెక్సికో, మధ్య అమెరికాతో ఉన్న సరిహద్దు వద్ద ప్రతినెలా వందల, వేల మంది అక్రమ వలసదారులు అమెరికాలోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్నారని ట్రంప్ వారిపై చర్యలు తీసుకుంటున్నారు. అక్రమవలదారుల విషయంలో ఆయన మరోసారి మండిపడ్డారు. అక్రమంగా అమెరికాలోకి ప్రవేశిస్తే.. కోర్టులు, కేసులు ఏమీ వొద్దని, వెంటనే వెనక్కి పంపించేయాలని ట్రంప్ అన్నారు. వారిపై న్యాయ విచారణ జరపాల్సిన అవసరం కూడా లేదని, చట్టప్రకారం ఉన్న న్యాయ విచారణ ప్రక్రియను తొలగించేయాలని పేర్కొన్నారు. సరిహద్దుల వద్ద అక్రమంగా ప్రవేశించిన వారి నుంచి పిల్లలను వేరు చేసే విధానంపై సర్వత్రా విమర్శలు రావడంతో ట్రంప్ ఇటీవల వెనక్కి తగ్గి ఆ విధానానికి స్వస్తి పలికిన సంగతి తెలిసిందే.
"మన దేశంలోకి ఈ ఆక్రమణదారులను మేం అనుమతించలేము. ఎవరైనా అక్రమంగా వస్తే.. జడ్డిలు, కోర్టులు, కేసులు ఏమీ లేకుండా తక్షణమే వారిని ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి పంపేయాలి. చాలా మంది పిల్లలు తల్లిదండ్రులు లేకుండా వస్తున్నారు. మన వలస పాలసీని చూసి ప్రపంచం నవ్వుతోంది. విచారణకు ఏళ్ల సమయం పడుతోంది. ప్రతిభ ఆధారంగా మాత్రమే వలసలు ఉండాలి. అమెరికాను తిరిగి గొప్పగా మార్చే ప్రజలు కావాలి" అని ట్రంప్ ట్వీట్ చేశారు.