లండన్, జూన్ 26 : బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగనామం పెట్టి విదేశాలకు పారిపోయిన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా లైన్ లోకి వచ్చినట్లు కనిపిస్తుంది. భారత ప్రభుత్వ ధాటికి తట్టుకోలేక ఎట్టకేలకు దిగొచ్చిన విజయ్ మాల్యా బ్యాంకులకు బకాయి పడిన రుణాలన్నింటిన్నీ చెల్లించడానికి సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించాడు. మాల్యాను భారత్ నుండి రప్పించడానికి మన ప్రభుత్వం శతవిధాల ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల తీసుకొచ్చిన కొత్త చట్టం 'పారిపోయిన ఆర్థిక నేరగాళ్ల ఆర్డినెన్స్' కింద మాల్యాను పారిపోయిన నేరస్థుడిగా ప్రకటించాలని, ఆయనకు చెందిన రూ.12,500 కోట్ల ఆస్తులు జప్తు చేయాలని ఈడీ ఇటీవల ముంబయి కోర్టులో దరఖాస్తు దాఖలు చేసింది.
దీనిపై తాజాగా మాల్యా లండన్ మీడియా వర్గాల ద్వారా స్పందించారు. ప్రభుత్వం తనపై తీసుకుంటున్న క్రిమినల్ చర్యలతో విసిగిపోయానన్నారు. ఈ సందర్భంగా.." ఇన్నాళ్ళు చాలాకాలం పాటు మౌనంగా ఉన్నాను. ఇప్పుడు నా విషయంలో జరుగుతున్న వివాదాస్పద అంశాలపై స్పందించాల్సిన సమయం వచ్చింది. బ్యాంకులకు రూ.9000 కోట్లు ఎగ్గొట్టానని కొందరు రాజకీయ నాయకులు, మీడియా వర్గాలు నన్ను దూషిస్తున్నాయి. త్వరలో నేను బ్యాంకులకు ఎగ్గొట్టిన రుణాలన్నీ సెటిల్ అయ్యేలా చర్యలు తీసుకుంటాను. తప్పుడు ఆరోపణలతో ఈడీ, సీబీఐ నాపై చార్జ్ షీట్ దాఖలు చేసింది. నాకు సంబంధించిన ఆస్తులను జప్తు చేశారు. ఒక్కమాటలో చెప్పాలంటే నేను పోస్టర్ బాయ్ అయిపోయాను. 2016 ఏప్రిల్ 15న ప్రధాని నరేంద్ర మోదీకి, ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీకి లేఖ రశాను. కానీ వారి నుంచి ఎలాంటి స్పందన రాలేదు. రుణాలను రికవరీ చేయడం సివిల్ విషయమని, కానీ తనది మాత్రం క్రిమినల్ కేసుగా వ్యవహరిస్తున్నారు" అని మాల్యా వ్యాఖ్యానించారు.