మరో అరుదైన రికార్డు ముంగిట ధోని..

     Written by : smtv Desk | Wed, Jun 27, 2018, 03:20 PM

మరో అరుదైన రికార్డు ముంగిట ధోని..

ఢిల్లీ, జూన్ 27 : టీమిండియా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్‌ ధోనీ అరుదైన రికార్డుకు చేరువయ్యాడు. భారత్‌ తరఫున ఈ రికార్డును ఇప్పటి వరకు మాస్టర్ బ్లాస్టర్ సచిన్‌ తెందుల్కర్‌, మిస్టర్ డిపెండబుల్ రాహుల్‌ ద్రవిడ్‌ మాత్రమే అందుకోగలిగారు. ఇంతకీ ఆ రికార్డు ఏమిటా అనుకుంటున్నారా..! అదేంటంటే.. భారత్‌ తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లో మూడు ఫార్మాట్‌లలో కలిపి 500లు, ఆపైన మ్యాచ్‌లు ఆడటం. ప్రస్తుతం ధోనీ 497 (వన్డేలు-318, టెస్టులు-90, టీ20లు-89) మ్యాచ్‌లతో ఉన్నాడు.

టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ధోనీ ఐర్లాండ్‌తో రెండు టీ20లు, ఇంగ్లాండ్‌తో 3 టీ20లు, మూడు వన్డేలు ఆడనున్నాడు. ధోనీ ఈ ఎనిమిది మ్యాచ్‌ల్లో ఆడితే అంతర్జాతీయ క్రికెట్‌లో అతడు ఆడిన మ్యాచ్‌ల సంఖ్య 505కు చేరనుంది. ఐర్లాండ్‌తో బుధవారం, శుక్రవారం రెండు టీ20లు ఆడనున్నాడు. ఆ తర్వాత జులై 3న ఇంగ్లాండ్‌తో టీ20 ఆడనున్నాడు. ఈ మూడు మ్యాచ్‌లు ఆడితే ధోనీ 500 మ్యాచ్‌ల క్లబ్‌లో చేరతాడు. అన్ని దేశాల క్రికెటర్లతో పోల్చుకున్నా సచిన్‌దే అగ్రస్థానం. ఆ తర్వాతి స్థానంలో శ్రీలంక ఆటగాడు మహేల జయవర్ధనే(652) ఉన్నాడు. కుమార సంగాక్కర (594) మూడో స్థానంలో ఉండగా మహేంద్ర సింగ్‌ ధోనీ పదో స్థానంలో కొనసాగుతున్నాడు.

మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ తెందుల్కర్‌ ఎవరికీ అందనంత దూరంలో ఉన్నాడు. గరిష్ఠంగా 664 (టెస్టులు 200, వన్డేలు 463, టీ20-1)తో అగ్రస్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత రాహుల్‌ ద్రవిడ్‌ 509(టెస్టులు-164, వన్డేలు-344, టీ20-1) మ్యాచ్‌లతో రెండో స్థానంలో ఉన్నాడు. త్వరలో ధోనీ భారత్‌ తరఫున 500 మ్యాచ్‌లు ఆడిన మూడో ఆటగాడిగా రికార్డు నెలకొల్పనున్నాడు.





Untitled Document
Advertisements