పసికూన పై సిరీస్ పట్టేశారు..

     Written by : smtv Desk | Sat, Jun 30, 2018, 10:58 AM

పసికూన పై సిరీస్ పట్టేశారు..

డబ్లిన్, జూన్ 30 : ఐర్లాండ్ పర్యటనలో టీమిండియా జట్టు ఆదరగొట్టింది. కోహ్లిసేన ధాటికి పసికూన ఐర్లాండ్‌ జట్టు కుదేలైంది. ఐర్లాండ్‌తో జరిగిన రెండు టి20 మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్‌ 2–0తో కైవసం చేసుకుంది. శుక్రవారం ఇక్కడ జరిగిన రెండో టి20లో భారత్‌ 143 పరుగుల భారీ తేడాతో ఐర్లాండ్‌ను చిత్తుగా ఓడించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది. కేఎల్‌ రాహుల్‌ (36 బంతుల్లో 70; 3 ఫోర్లు, 6 సిక్సర్లు), సురేశ్‌ రైనా (45 బంతుల్లో 69; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధ సెంచరీలతో కదం తొక్కారు. వీరిద్దరు రెండో వికెట్‌కు 57 బంతుల్లోనే 106 పరుగులు జోడించగా, చివర్లో హార్దిక్‌ పాండ్యా (9 బంతుల్లో 32 నాటౌట్‌; 1 ఫోర్, 4 సిక్సర్లు) మెరుపులు మెరిపించాడు.

భారీ లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన ఐర్లాండ్‌ కనీస స్థాయి పోరాటాన్ని కూడా ప్రదర్శించలేకపోయింది. తొలి మ్యాచ్‌లోనైనా కాస్త చెప్పుకోదగ్గ ఆటతీరు కనబర్చిన జట్టు ఈ సారి పూర్తిగా చేతులెత్తేసింది. భారత బౌలర్ల ధాటికి 12.3 ఓవర్లలో 70 పరుగులకే కుప్పకూలింది. స్పిన్నర్లు కుల్దీప్‌ యాదవ్‌ (3/16), చాహల్‌ (3/21), పేసర్‌ ఉమేష్‌ (2/19) రాణించారు. ఈ మ్యాచ్‌తో పేసర్‌ సిద్దార్థ కౌల్‌ టీ20ల్లో అరంగేట్రం చేశాడు. రాహుల్‌కు 'మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌', చాహల్‌కు 'మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌' అవార్డులు దక్కాయి.





Untitled Document
Advertisements