కంచికచర్ల, జూలై 2 : కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం గొట్టుముక్కల గ్రామానికి చెందిన గోగినేని నాగార్జున అనే సాఫ్ట్వేర్ ఇంజినీర్ అమెరికాలో ప్రమాదవశాత్తూ దుర్మరణం పాలయ్యాడు. దీంతో గ్రామంలో విషాదం ఛాయలు అలుముకున్నాయి. విహారయాత్రలో భాగంగా నార్త్ కరోలినా ప్రాంతంలోని ఓ జలపాతంలో ప్రమాదవశాత్తూ పడి మృతిచెందారు. ఈ విషయాన్ని నాగార్జున మిత్రులు, అతని కుటుంబ సభ్యులకు తెలియజేశారు.
మృతుడు నాగార్జున తండ్రి 7 సంవత్సరాల క్రితం మరణించారు. సోదరుడు యశ్వంత్ హైదరాబాదులో ఉద్యోగం చేస్తున్నారు. నాగార్జున చెల్లి పూజితకు వివాహం కాగా విజయవాడలో నివాసం ఉంటున్నారు. ఉన్నత చదువుల కోసం 10 సంవత్సరాల క్రితం అమెరికా వెళ్ళి అక్కడే ఉద్యోగం చేస్తున్నారు. తల్లి రాజేశ్వరి విజయవాడలో కూతురు వద్ద ఉంటున్నారు.