ఢిల్లీ, జూలై 2 : ఇంగ్లండ్తో మంగళవారం నుంచి ప్రారంభంకానున్న మూడు టి20 మ్యాచ్ల సిరీస్కు భారత పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా, యువ స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్లు గాయాల కారణంగా వైదొలిగారు. ఐర్లాండ్తో తొలి టి20 సందర్భంగా ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో బుమ్రా ఎడమ వేలికి గాయం కాగా.. ప్రాక్టీస్ సెషన్లో ఫుట్బాల్ ఆడుతూ స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ గాయపడ్డాడు. దీంతో 'పేసర్ బుమ్రా స్థానంలో దీపక్ చాహర్ను, వాషింగ్టన్ సుందర్ స్థానంలో టీ20ల్లో ఆల్రౌండర్ కృనాల్ పాండ్య, వన్డే సిరీస్కు అక్షర్ పటేల్ను ఎంపికచేసినట్లు’ బీసీసీఐ తాత్కాలిక కార్యదర్శి అమితాబ్ చౌదరి ఓ ప్రకటనలో వెల్లడించారు.
దీంతో ఇంగ్లాండ్తో పరిమిత ఓవర్ల సిరీస్కు వాషింగ్టన్ సుందర్ దాదాపు దూరమైనట్లే. కానీ బుమ్రా కేవలం టీ20 సిరీస్కు మాత్రమే దూరం కానున్నాడు. ఐపీఎల్లో గత రెండేళ్లుగా ముంబయి ఇండియన్స్కు ఆడిన కృనాల్ పాండ్య మంచి ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. మరోవైపు దీపక్ చాహర్ కూడా దేశవాళీ టోర్నీలలో అద్భుతంగా రాణించి, ప్రస్తుతం ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న భారత్-ఏ జట్టుకు ఆడుతున్నాడు.