సియోల్, జూలై 2 : భారత పర్యటనకు దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే ఇన్ రానున్నారు. జులై 8 నుంచి 11వ తేదీ వరకు ఆయన భారత్లో పర్యటించనున్నట్లు కొరియా అధ్యక్ష కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. పర్యటనలో భాగంగా మూన్ జే ఇన్ భారత ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశం కానున్నారు. ఆర్థిక సహకారంపై ఇరువురు నేతలు చర్చించనున్నట్లు తెలుస్తోంది. నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు మూన్ జే ఇన్ భారత సందర్శనకు వస్తున్నారని, ఆయన రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ను కూడా కలవనున్నారని ప్రకటనలో తెలిపారు.
ఆర్థిక వ్యవహారాల్లోనే కాకుండా కొరియా ద్వీపంలో శాంతి, సుసంపన్నత నెలకొల్పాలన్న భారత ఆలోచనలూ ఇందుకు కారణమని తెలిపింది. మూన్ జే ఇన్ భారత పర్యటన అనంతరం సింగపూర్ పర్యటనకు వెళ్లనున్నారు. కొరియా ద్వీపంలో శాశ్వతంగా శాంతి నెలకొల్పడంపై , ఆసియా దేశాలతో పరస్పర సహాయ సహకారాల అంశంపై ఆయన అభిప్రాయాలు, విధానాల గురించి ప్రసంగించనున్నట్లు తెలుస్తోంది.