కంపాలా, జూలై 3 : ప్రస్తుత సమాజంలో ఇంటర్నెట్ వినియోగం బాగా పెరిగిపోయింది. పొద్దున్న లేచిన మొదలు ఫోన్ పట్టుకొని అందరితో తెగ చాట్ చేస్తాం. సోషల్ మీడియా శరవేగంగా విస్తరించిన క్రమంలో యువత దానికి బానిసగా మారిపోతున్నారు. ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్, స్కైప్ ఇలా పలు రకాల మాద్యామాల వినియోగానికి ప్రపంచం అలవాటు పడింది. ఇలాంటి సమయంలో సోషల్ మీడియా వినియోగించాలి అంటే ప్రత్యేకంగా పన్ను చెల్లించాలనే వార్తకు యువత నోట మాట రావడం లేదు. కేవలం వార్తకే ఇలా ప్రపంచ యువత షాక్కు గురవుతుంటే, జులై 1న ఉగాండా ప్రభుత్వం అధికారికంగా సోషల్ మీడియా ట్యాక్స్ను విధించడం ప్రారంభించింది.
సోషల్ మీడియా వల్ల దేశ ఆదాయం, సమయం వృథా అవుతోందని దేశాధ్యక్షుడు యోవేరి ముసెవేని ఫిర్యాదు చేశారు. దీంతో ఈ ఏడాది సోషల్ మీడియా పన్నును ప్రవేశపెట్టాలని ప్రభుత్వానికి టీఆర్ఏ సూచించింది. కాగా, ప్రపంచబ్యాంకు లెక్కల ప్రకారం ఉగాండాలో 22 శాతం మంది మాత్రమే ఇంటర్నెట్ను వినియోగిస్తున్నారు. దీనిపై ఆ దేశవ్యాప్తంగా యువత నిరసన తెలుపుతోంది. అయితే, ఉగాండా ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని ఉన్నట్లుండి ఏమీ తీసుకోలేదు. ముందుగానే ఈ పన్నును విధించబోతున్నట్లు ప్రకటించింది.
ఈ నెల 1 నుంచి వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్, స్కైప్ వంటి సోషల్ మాధ్యమాలను వినియోగించడానికి రోజుకు 200 ఉగాండా షిల్లింగ్స్ను చెల్లించాలి.దేశంలోని యువతను అదుపు చేసేందుకు ఉగాండా ప్రభుత్వం ఇంటర్నెట్పై ఆంక్షలు విధించడం కొత్తేమి కాదు. 2016లో ఆ దేశ టెలికాం రెగ్యులేటరీ అథారిటీ(టీఆర్ఏ) ఎన్నికల సందర్భంగా ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది.