అమరావతి, జూన్ 5 : నెల్లూరు జిల్లా కావలిలో ర్యాలీ నిర్వహిస్తున్న ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణపై తెలుగుదేశం పార్టీకి చెందిన కార్యకర్త ఒకరు చెప్పులతో దాడి చేసిన ఘటన తెలిసిందే. ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. ఇలాంటి వాటికి తాను పూర్తిగా వ్యతిరేకమని.. ఇకపై ఎవరూ ఇలాంటి పనులకు పాల్పడవద్దని హెచ్చరించారు. నమ్మక ద్రోహం చేస్తున్న కేంద్రప్రభుత్వానికి వ్యతిరేకంగా తాము ధర్మపోరాటం చేస్తున్నామని చంద్రబాబు అన్నారు.
కడపకు స్టీల్ ప్లాంట్ ఇవ్వమంటే ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. 15 సంవత్సరాల పాటు తాము కట్టే పన్నులను వాయిదా వేయాలన్నారు. అప్పుడు మేమే ఈ ప్లాంటును కట్టుకుంటామంటూ స్పష్టం చేశారు. అలాగే వైఎస్సార్సీపీ, జనసేనా పార్టీలకు అభివృద్ధి పనులు కనిపించడం లేదా అంటూ ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం చేతనైతే కేంద్రంతో పోరాడాలని.. అంతేగాని రాష్ట్రానికి అన్యాయం చేయాలని చూస్తే మాత్రం ఊరుకునేది లేదని హెచ్చరించారు.