లఖ్నవూ, జూలై 6 : పర్యావరణానికి హానీ కలిగిస్తున్న ప్లాస్టిక్ పై మహారాష్ట్ర ఉక్కుపాదం మోపిన విషయం తెలిసిందే. తాజాగా ఇప్పుడు ఉత్తర్ప్రదేశ్లోనూ ప్లాస్టిక్ను నిషేధిస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జులై 15 నుంచి ఈ నిబంధన అమల్లోకి వస్తుందని అక్కడి ప్రభుత్వం తెలిపింది. 'ప్రజలు జులై 15 నుంచి అన్ని చోట్లా ప్లాస్టిక్ కవర్లు, కప్పులు, గ్లాసులు వాడటం మానేస్తారని ఆశిస్తున్నాను. ఈ నిషేధాన్ని అమలు చేయడానికి ప్రజలందరి సహకారం తప్పనిసరి' అని యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వెల్లడించారు.
ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా 5 ట్రిలియన్ల (5 లక్షల కోట్లు) ప్లాస్టిక్ బ్యాగులు ఉపయోగిస్తున్నట్లు ఐరాస అంచనా వేసింది. గత నెలలో జూన్ 23న మహారాష్ట్ర ప్రభుత్వం ప్లాస్టిక్ నిషేధాన్ని అమల్లోకి తెచ్చింది. కాగా, చిన్న వ్యాపారులకు, రిటైలర్లకు ప్రభుత్వం ప్లాస్టిక్ కవర్ల వినియోగం విషయంలో మినహాయింపు ఇచ్చింది. కిరాణా షాపులు, ఇతర సాధారణ దుకాణాలలో ధాన్యాలు, తదితర వస్తువులు ప్యాక్ చేయడానికి ప్లాస్టిక్ కవర్లు ఉపయోగించుకోవచ్చని తెలిపింది. అయితే కవర్ మందం 50 మైక్రాన్స్ కంటే ఎక్కువ ఉండాలని ఆదేశించింది.