పుత్రజయ, జూలై 6 : వివాదాస్పద ఇస్లాం మతప్రబోధకుడు జకీర్ నాయక్ ను అప్పగించే విషయంలో మలేషియా ప్రభుత్వం భారత్ కు షాకిచ్చింది. జకీర్ను భారత్కు అప్పగించే ప్రసక్తే లేదని మలేషియా ప్రధాని మహతీర్ మహ్మద్ శుక్రవారం స్పష్టం చేశారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 'జకీర్ మలేషియాలో శాశ్వత నివాస హోదా కలిగి ఉన్నారు. ఆయన వల్ల మాకు సమస్యలు రానంత వరకు దేశం విడిచి వెళ్లాలంటూ ఒత్తిడి చేయలేమని' మహతీర్ అన్నారు. మలేషియాలో నివాసముంటున్న జకీర్ను అప్పగించాల్సిందిగా భారత విదేశాంగ శాఖ మలేషియా ప్రభుత్వాన్ని కోరిన విషయం తెలిసిందే.
అప్పగింత ఒప్పందంలో భాగంగా గత జనవరిలో చేసిన భారత్ చేసిన అభ్యర్థనకు మలేషియా సానుకూలంగా స్పందిస్తుందంటూ విదేశాంగ అధికార ప్రతినిధి రవీశ్ కుమార్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో మలేషియా ప్రధానే స్వయంగా ఈ విషయమై స్పష్టతన్విడం గమనార్హం. ఇటీవల జకీర్ నాయక్ ఇండియా వస్తున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ అవి అవాస్తవాలని ఆయనే స్వయంగా ప్రకటించారు.