కార్డిఫ్, జూలై 7: ఇంగ్లాండ్ పర్యటనలో భాగంగా నిన్న జరిగిన మ్యాచ్ కోహ్లి సేన ఓటమి పాలైన సంగతి తెలిసిందే. కార్డిఫ్ వేదికగా భారత్తో జరిగిన రెండో టీ20లో ఇంగ్లాండ్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. కాగా ఓటమిపై స్పందించిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి నిరాశ వ్యక్తం చేశాడు. ప్రధానంగా తొలి ఆరు ఓవర్లలో 30 పరుగులు చేసి మూడు వికెట్లను చేజార్చుకోవడంతో మ్యాచ్ ఓడిపోయమన్నాడు.
'తొలి ఆరు ఓవర్లే మా ఓటమికి ప్రధాన కారణం. పవర్ ప్లే ముగిసే సమయానికి మూడు వికెట్లను కోల్పోవడమే మా కొంప ముంచింది. ఆరంభంలో వరుసగా వికెట్లను కోల్పోవడంతో మాపై ఒత్తిడి పెరిగింది. అదే సమయంలో పవర్ ప్లే పరుగులు రాకపోవడంతో చివరకు మంచి స్కోరును సాధించలేకపోయాం. ఇంకా 15 పరుగులు చేయాల్సి ఉంది. ఓవరాల్గా చూస్తే బాగానే ఆడాం. ఇంగ్లండ్ కూడా 149 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో చాలా కష్ట పడాల్సి వచ్చింది' అని కోహ్లి వ్యాఖ్యానించాడు.