ఢిల్లీ, జూలై 7 : దేశవ్యాప్తంగా లోక్సభకు, అసెంబ్లీ స్థానాలకు ఒకేసారి ఎన్నికల నిర్వహించాలని కేంద్రం భావిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా జమిలి ప్రతిపాదనపై లా కమిషన్ శనివారం వివిధ రాజకీయ పార్టీలతో సంప్రదింపులు జరిపింది. ఒకేసారి ఎన్నికలపై పార్టీలు భిన్నాభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి. మెజారిటీ పార్టీలు దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు సాధ్యపడబోవని చెప్పాయి. లా కమిషన్తో సమావేశమైన టీఎంసీ (తృణమూల్ కాంగ్రెస్), సీపీఐ, గోవా ఫార్వర్డ్ పార్టీల నేతలు జమిలి ఎన్నికల ప్రతిపాదనను వ్యతిరేకించారు. జమిలి ఎన్నికలు సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని, ప్రజాస్వామ్యానికి విఘాతమని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు అభిప్రాయపడ్డారు.
జమిలి ఎన్నికలు సాధ్యం కావు అని, రాజ్యాంగపరంగా ఇది వీలు కాదని టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బేనర్జీ అభిప్రాయపడ్డారు. ఇక, తమిళనాడులో అధికారంలో ఉన్న అన్నాడీఎంకే జమిలి ఎన్నికలపై ఒకింత భిన్నంగా స్పందించింది. జమిలి ఎన్నికలు 2019లో సాధ్యం కావని, అదే 2024లో జమిలి ఎన్నికలు నిర్వహిస్తే.. అందుకు తాము సిద్ధమని వెల్లడించింది.