బ్రిస్టల్, జూలై 9 : టీమిండియా హిట్ మ్యాన్ రోహిత్ శర్మ టీ-20ల్లో మరో రికార్డు సృష్టించాడు. ఇంగ్లాండ్ పర్యటనలో భాగంగా జరిగిన మూడు టీ-20 ల సిరీస్ ను 2-1 తో భారత్ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. టోర్నీ లో భాగంగా ఆదివారం రాత్రి జరిగిన నిర్ణయాత్మక చివరి టీ20 మ్యాచ్లో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ఇంగ్లండ్ విధించిన 199 పరుగుల భారీ లక్ష్యాన్ని భారత్ మరో 8 బంతులుండగానే 3 వికెట్లు కోల్పోయి చేధించింది. ఓపెనర్ రోహిత్శర్మసునామీల చెలరేగి 56 బంతుల్లోనే(11×4, 5×6) అజేయ శతకం సాధించి జట్టుకు విజయాన్ని అందించాడు.
ఈ శతకం టీ20ల్లో అతడికి మూడోది కావడం విశేషం. తద్వారా ఈ ఫార్మాట్లో అత్యధిక శతకాలు సాధించిన న్యూజిలాండ్ ఆటగాడు కొలిన్ మన్రో సరసన రోహిత్ చేరాడు. ఇప్పటివరకు 84 టీ20 మ్యాచ్లు ఆడిన రోహిత్.. 77 ఇన్నింగుల్లో 2086 పరుగులు చేశాడు. ఇందులో 3 శతకాలు, 15 అర్ధశతకాలు ఉన్నాయి. అంతే కాకుండా కోహ్లీ తర్వాత టీ20ల్లో రెండు వేల పరుగులు పూర్తి చేసిన రెండో భారత ఆటగాడిగా రోహిత్ నిలిచాడు.