హైదరాబాద్, జూలై 9 : వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ గత కొంతకాలంగా వార్తల్లో నిలుస్తోన్న కత్తి మహేశ్ను.. నగరం నుండి ఆర్నెల్ల పాటు బహిష్కరణ విధించినట్లు తెలంగాణ డీజీపీ మహేందర్రెడ్డి తెలిపారు. హైదరాబాద్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన కత్తి మహేశ్ నగర బహిష్కరణపై అధికారిక ప్రకటన చేశారు. కత్తి మహేశ్ ఈ ఆర్నెల్లలో పోలీసుల అనుమతి లేకుండా హైదరాబాద్లోకి ప్రవేశిస్తే అరెస్టు చేసి విచారిస్తామని.. అతడికి మూడేళ్ల వరకు జైలుశిక్ష పడే అవకాశం ఉందని డీజీపీ వెల్లడించారు. అంతే కాకుండా ఓ టీవీ ఛానల్ కత్తి మహేశ్ వ్యాఖ్యలను పదేపదే ప్రసారం చేసిందని..ఛానల్ యాజమాన్యానికి షోకాజ్ నోటీసు జారీ చేశామని తెలిపారు.
ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.." భావ వ్యక్తీకరణ అనేది ప్రాథమిక హక్కు అయినప్పటికీ.. దానివల్ల సమాజంలోని ఇతరుల మనోభావాలు దెబ్బతినకుండా వ్యవహరించాలి. ప్రజలు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే శాంతి భద్రతలు క్షీణిస్తాయి. అందువల్ల ఇలాంటి ఘటనలు రాష్ట్రంలో జరిగితే కఠినచర్యలు తీసుకోవాలని నిర్ణయించాం. అందువల్ల కత్తి మహేశ్ను 6 నెలల పాటు నగరం నుంచి బహిష్కరించాం. అందువల్ల కత్తి మహేశ్ను 6 నెలల పాటు నగరం నుంచి బహిష్కరించాం. ఆయన్ని స్వస్థలమైన చిత్తూరు జిల్లాకు తరలించాం. అక్కడే ఉపాధి అవకాశాలు కల్పించాం." అని ఆయన వ్యాఖ్యానించారు.